ఈ నవల రాయటంలో రెండు ఉద్దేశ్యాలున్నాయి. రాయలసీమ రైతు, రైతు కూలీల బతుకులు ఇప్పుడు వలస బతుకులయ్యాయని చెప్పటం ఒకటైతే. రెండవ విషయం ఏమిటంటే – ఎన్ని కష్టాలు వెంటాడుతూ వున్నా ఏడుస్తూ కూచోవటం ఇక్కడి మనుషుల లక్షణం కాదు. ఎంత ఆకలేసినా చేతులు చాచి అడుక్కోవటం ఇక్కడి రైతులకు అలవాటు లేదు. నిరంతరం బతికేందుకే పోరాడుతుంటారు. బండరాతి మీద అయినా సరే పిడికెడు అన్నం పుట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు.
చెతుర్లాడుకోవటంలో ఆకలిని మరుస్తారు. బూతు పదాలు కలిసిన మాటలతో హాస్య సంఘటనలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కష్టాలు మరవటానికి ప్రయత్నిస్తారు. సద్ది సేరవలో పుల్లనీళ్ళ మీద తేలే పచ్చిమిరపకాయ మీద కూడా జోకులేసుకుంటూ దుర్భరమైన ఆ తిండినే కడుపారా తిని పనికి పోగలరు. బీడీకట్టకు లెక్కలేనంత దరిద్రంలో ఉందికూడా ఒకే బీడీని నలుగురు పంచుకు తాగుతూ తమ దరిద్రం మీద తామే జోకులేసుకోగలరు. ఇక్కడి రైతు కరువుకు అలవాటు పడ్డాడు – ఆకలికి లాగే నాయకుల వాగ్దానాలకు అలవాటు పడ్డాడు – వట్టి మేఘాల ఉరుములకు లాగే.
– సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి