సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్ చందర్ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.
ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకీ, ప్రేమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలి, జీవిత వైవిద్యం, మానసిక అంతర్మథనానికి మాటలతో రూపమివ్వటం – కిషన్ చందర్ ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి. “గాలిబ్ వారసుడు”గా సాహితీలోక సమాదరణ పొందిన కిషన్ చందర్ 1977 మార్చి 8న కీర్తిశేషులయ్యారు.