కొతగా పెళ్లి అయ్యి అత్తవారి ఇంటికి వచ్చిన కొత్తలో నేను మా ఇంటి ముందు ఉన్న ఒక పంజరంలో పక్షులను చూస్తూ సమయం గడిపేదానిని. – పంజరంలో ఉన్న పక్షులు ఎప్పుడూ ఎగరవు, అరవవు. చాలా నీరసంగా ఉంటాయి. ఏమైందో అర్థం కాక దగ్గరగా వెళ్లి చూసాను. ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావ్ అని అడిగితే ఆ పక్షి చెప్పింది.
“స్వేచ్చగా నింగికి ఎగరవల్సిన ఒక పక్షిని నేను అనుకున్నాను. ఎగిరాను. రెక్కలు విరిగిపోయి నొప్పి వస్తున్నా ఎగిరాను. నేల రాలిపోతానేమో అని భయం కలిగినా ఎగిరాను. ఎందుకంటే నేను ఎగరాలి అనుకున్నాను. ఎందుకో ఏమిటో ఇదంతా నాకు తెలీదు. నా మొహమున ఒక బొట్టుతో ముద్రవేసి, మెడకు తాడు బిగించేసి, నా రెక్కలను నలిపేసి, నా చుట్టూ ఒక గీత గిరిగీసి, నన్ను బందిఖానలో పెట్టేసి ఇప్పుడు ఎగురు, సంతోషంగా ఎగురు అని అడిగితే నేనేం చెయ్యాలి? మెడలో ఉన్నది ఇనుప సంకెళ్లు కాదు కదా తాళి మాత్రమే అన్నారు కానీ ఇది మీరు నన్ను చూసి చేస్తున్న ఎగతాళి కాదా??
ఇపుడు నేను ఎగరలేను. ఎందుకు ఎగరాలి నేను? ఎంత ప్రయత్నం చేసినా నేను ఈ బందిఖానాలోనుండి బయటపడను కదా ? ఎందుకు ఎగరలి నేను?” అని తిరిగి అడిగింది ఆ పక్షి.
పక్షి పలికిన మాటలు ఎవరివి? ఎవరి మనసులోని భావాలకి ప్రతిబింబాలవి?





