సప్తసింధు సలిల ధారలతో సంపన్నమయిన ధాత్రి. హిమగిరి శిఖరాల ఔన్నత్యాన్ని సంతరించుకున్న పవిత్ర హిమాచల పాదపీఠిక,
పచ్చని పైరుపొలాలు, ఎందెందు చూచినా జీవజలధారలు పొంగిపొరలే సింధూతీర ప్రాంతమంతా అందాల హరివిల్లు, పుష్కలవతీ నగరం సాంద్ర జనావాసమై వర్ధిల్లుతున్న కాలమది. ఒకవంక గాంధార శిల్పుల పోగారు దెబ్బల చిన్ని చిన్న శబ్దాలు రవరవలాడుతున్న చోటు. మరొకవంక తక్షశిలలో ఛాత్రులు సంతలో వేదనాదాలు వల్లిస్తున్న పవిత్ర ప్రాంతమది. వేదఘోషలు దిక్కుల్ని తాకుతున్నాయి.
వేరొక వంక కపిశాతీరం నించి వచ్చే ఆలమందల అంబారవాలు హైందవ సంస్కృతీ గీతాలవలె విహాయస వీధుల్ని తాకుతున్న ప్రాంతం.
వితస్తా నదీతీరమంతా వినూత్నమయిన అందచందాలను సంతరించుకున్నది. పుష్కలావతిలో కోయిలలు కుహూ అంటే వితస్తా జలధారల మీద తరంగాలు ఓహో అంటున్నాయి. బ్రాహ్మణుల వేదఘోష మిన్నంటుతోంది. పుష్కలావతిలో పదారు ప్రధాన వీధులు. ఒక వీధిలో అరుగుపై ఆలోచనామగ్నురాలయి కూర్చున్నదా అమ్మాయి. తరళాయితంగా వున్న విశాలనేత్రాలు – పసిమివర్ణ శరీరకాంతి పరిసరాలను సైతం ప్రభావితం చేస్తోంది. తిన్నని ముక్కు, నున్నని చెక్కిళ్ళు, సున్నితమైన చేతివ్రేళ్ళు, అందమంతా రాసిపోసినట్లుగా వున్నదా అమ్మాయి. ముఖంలో ఏదో దిగులు తాలూకు నీలినీడలు కదులాడుతున్నాయి. అరుణారుణమయిన పెదవులు పాలిపోయున్నాయి. పదే పదే ఊర్పులు. తీస్తోంది.





